Ratha Saptami 2026: ఆరోగ్య ప్రదాయిని సూర్య ఆరాధన.. స్నాన విధి, విశిష్టత ఇవే!

Ratha Saptami 2026: రథ సప్తమి పండుగ ఆదివారం అంటే 25 జనవరిన జరుపుకోబోతున్నారు. రథసప్తమి రోజు ఏమి చేయాలి? పూజా విధానం వివరాలు ఈ ఆర్టికల్ లో

Ratha Saptami 2026: హిందూ సంప్రదాయంలో ప్రత్యక్ష దైవంగా భావించే సూర్య భగవానుడి జన్మదినాన్ని పురస్కరించుకుని, మాఘ మాస శుక్ల పక్ష సప్తమి రోజైన జనవరి 25, 2026 ఆదివారం నాడు తెలుగు రాష్ట్రాల్లో భక్తులు రథసప్తమి వేడుకలను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకోనున్నారు. త్రిమూర్తి స్వరూపుడైన భాస్కరుడిని ఆరాధించడం ద్వారా ఆరోగ్యం, ఐశ్వర్యం సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ముఖ్యంగా ఈ రోజున ఆచరించే విశిష్ట స్నాన విధికి శాస్త్రోక్తమైన, ఆరోగ్యపరమైన ప్రాధాన్యత ఉంది.

రథసప్తమి స్నాన విధి: ఏ ఆకులు వాడాలి?

రథసప్తమి రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేయడం అత్యంత పుణ్యఫలమని పండితులు చెబుతున్నారు. ఈ పర్వదినాన స్నానం చేసేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన ఆకులను ఉపయోగించడం మన సంప్రదాయంలో ఉంది.

  • పవిత్ర పత్రాలు: 7 జిల్లేడు ఆకులు, 7 రాగి ఆకులు, 7 చిక్కుడు ఆకులను తల, భుజాలు, మెడ, ఛాతీ, తొడల మీద ఉంచుకుని స్నానం చేయాలి.

  • ఆరోగ్య రహస్యం: జిల్లేడు ఆకులను ‘ఆర్క పత్రాలు’ అని కూడా అంటారు. ఇవి సూర్యరశ్మిలోని శక్తిని గ్రహించి, తల భాగంలోని బ్రహ్మరంధ్రం ద్వారా మన శరీరంలోని నాడులను చైతన్యవంతం చేస్తాయని ప్రకృతి వైద్యం చెబుతోంది.

  • స్త్రీ, పురుష నియమం: సాధారణంగా పురుషులు జిల్లేడు ఆకులను, స్త్రీలు చిక్కుడు ఆకులను తలపై ఉంచుకుని స్నానమాచరించడం విశేషం. ఇలా చేయడం వల్ల గత జన్మ పాపాలతో పాటు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని నమ్మకం.

Ratha Saptami 2026: సూర్యారాధన – నైవేద్యం

స్నానానంతరం ఇంటి ముందర రథం ముగ్గు వేసి, సూర్య భగవానుడిని షోడశోపచారాలతో పూజించాలి.

  1. చిక్కుడు రథం: చిక్కుడు కాయలతో చిన్న రథాన్ని తయారు చేసి అందులో సూర్యుడిని ఆవాహనం చేయడం ఆచారం.

  2. నైవేద్యం: ఆవు పాలు, కొత్త బియ్యంతో చేసిన పాయసం లేదా పొంగలిని నివేదించాలి.

  3. ఔషధ గుణాలు: నైవేద్యంగా సమర్పించిన పాయసాన్ని చిక్కుడు ఆకుల్లో ఉంచి ప్రసాదంగా స్వీకరించాలి. దీనివల్ల చిక్కుడు ఆకులోని ఔషధ గుణాలు శరీరానికి మేలు చేస్తాయి.

ఈ పవిత్ర రోజున(Ratha Saptami 2026) సూర్యుడితో పాటు పితృదేవతలకు అర్ఘ్యం వదలడం వల్ల పితృ దోషాలు తొలగి, వారి ఆశీస్సులు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. భానుడి కిరణాలు నేరుగా పడేలా ఆరుబయట ఆవు పిడకలతో చేసిన పొయ్యి పెట్టి, ఆవు పాలతో పరమాన్నం వండటం ఈ పండుగ ప్రత్యేకత.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *