America: వైట్ హౌస్ సమీపంలో కాల్పులు..పలువురికి గాయాలు.. ట్రంప్ కీలక ఆదేశాలు!

America: అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. వాషింగ్టన్ డీసీ లోని వైట్ హౌస్‌కు కొద్ది దూరంలోనే కాల్పులు చోటుచేసుకోవడంతో రాజధానిలో టెన్షన్ నెలకొంది. ఈ ఘటనలో ఇద్దరు నేషనల్ గార్డ్ సైనికులు సహా మొత్తం ముగ్గురు గాయపడ్డారు. గాయపడిన వారిని తక్షణమే ఆసుపత్రికి తరలించగా, ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

America: కాల్పులు స్థానిక సమయం ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో రద్దీగా ఉండే ఫారగుట్ స్క్వేర్ ప్రాంతంలో జరిగాయి. ఈ ప్రాంతంలో ఆఫీసులు, రెస్టారెంట్లు, కేఫేలు అధికంగా ఉండటంతో సంచార జనాభా కూడా ఎక్కువగా ఉంటుంది. కాల్పులు ప్రారంభమైన వెంటనే ప్రజలు భయంతో పరుగులు తీశారు.

America: ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఆఫ్ఘన్ పౌరుడు రహ్మానుల్లా లకన్వాల్‌గా గుర్తించారు. అతను 2021లో అమెరికాలోకి ప్రవేశించినట్లు అధికారులు వెల్లడించారు. నేషనల్ గార్డ్ సైనికులు వీధిలో నడుస్తుండగా, ఆకస్మికంగా వారిపై కాల్పులు జరిపినట్లు మెట్రోపాలిటన్ పోలీస్ అసిస్టెంట్ చీఫ్ జెఫ్ కారోల్ తెలిపారు. కాల్పుల అనంతరం గార్డ్ సభ్యులు వేగంగా స్పందించి లకన్వాల్‌ను అరెస్టు చేశారు.

వాషింగ్టన్ మేయర్ మురియెల్ బౌసర్ ఈ దాడిని ఖండిస్తూ ఇది లక్ష్యంగా చేసుకున్న దాడిగా కనిపిస్తోంది అని అన్నారు. మరోవైపు, FBI డైరెక్టర్ కాష్ పటేల్ గాయపడిన నేషనల్ గార్డ్ సభ్యుల్లో ఇద్దరి పరిస్థితి కొంత విషమంగా ఉందని తెలిపారు. ఘటన వెంటనే, పోలీసులు ప్రాంతాన్ని పూర్తిగా సీలు చేసి, భద్రతా చర్యలను కఠినంగా అమలు చేశారు. వైట్ హౌస్‌ను తాత్కాలికంగా లాక్‌డౌన్‌ చేశారు.

ఈ సంఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి చేసిన వ్యక్తులు దీనికి భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. అదనంగా, వాషింగ్టన్ నగర భద్రత కోసం 500 మంది నేషనల్ గార్డ్ దళాలను మరింతగా మోహరించాలని ఆయన ఆదేశించినట్లు రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్ తెలిపారు.

కాల్పులు ఎందుకు జరిగాయి, నిందితుడి ఉద్దేశ్యం ఏమిటన్న దానిపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటన అమెరికా రాజధాని భద్రత పై మరోసారి ప్రశ్నలు లేవనెత్తింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *