Andhra Pradesh Farmers: ఆంధ్రప్రదేశ్ రైతులకు సంక్రాంతి పండుగ తర్వాత నిజమైన ‘సంక్రాంతి’ వచ్చింది. గత రెండేళ్లుగా సాగు ఖర్చులు పెరిగి, సరైన గిట్టుబాటు ధర లేక అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులకు ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు భారీ ఊరటనిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రధానంగా పండే మిర్చి, వేరుశెనగ పంటలకు మార్కెట్లో రికార్డు స్థాయి ధరలు పలుకుతుండటంతో కర్షక లోకంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
మిర్చి ధరల్లో ‘హాట్’ రికార్డులు
ప్రస్తుతం ఏపీలోని గుంటూరు, కర్నూలు మార్కెట్లలో మిర్చి ధరలు మునుపెన్నడూ లేని విధంగా దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా పసుపు రంగు మిర్చి (Yellow Chilli) క్వింటాకు ఏకంగా రూ. 49,200 పలికి సరికొత్త రికార్డు సృష్టించింది. సాధారణ రకం మిర్చి కూడా క్వింటాకు సగటున రూ. 18,000 నుంచి రూ. 22,000 వరకు పలుకుతోంది.
ఈ పసుపు మిర్చికి అంతర్జాతీయ స్థాయిలో, ముఖ్యంగా సాస్లు మరియు రెస్టారెంట్ వంటకాల్లో వినియోగించే సహజ రంగుల కోసం విపరీతమైన డిమాండ్ ఉంది. దిగుబడి ఎకరానికి 25 క్వింటాళ్లు మాత్రమే వచ్చినా, ధర భారీగా ఉండటంతో సాగు చేసిన రైతులకు లాభాల పంట పండుతోంది.
Andhra Pradesh Farmers: వేరుశెనగలోనూ కాసుల వర్షం
రాయలసీమ జిల్లాల ప్రధాన పంట అయిన వేరుశెనగకు సైతం ఊహించని డిమాండ్ ఏర్పడింది. అంతర్జాతీయంగా నూనె గింజల కొరత, ఎగుమతులకు పెరిగిన గిరాకీ కారణంగా ప్రస్తుతం క్వింటా వేరుశెనగ ధర రూ. 9,652 కు చేరింది. గత కొన్నేళ్లుగా సరైన ధర లేక వేరుశెనగ సాగును తగ్గించిన రైతులకు, ఈ ఏడాది ధరలు పెరగడం పెద్ద ప్లస్ పాయింట్గా మారింది.
ధరలు పెరగడానికి ప్రధాన కారణాలు:
-
ఎగుమతుల డిమాండ్: చైనా, బంగ్లాదేశ్, శ్రీలంక వంటి దేశాలకు మిర్చి ఎగుమతులు పెరగడం.
-
తగ్గిన నిల్వలు: గత సీజన్లో నిల్వలు తక్కువగా ఉండటం, ప్రస్తుత డిమాండ్కు సరిపడా సరుకు అందుబాటులో లేకపోవడం.
-
విదేశీ మార్కెట్లు: అంతర్జాతీయ మార్కెట్లో వంట నూనెల ధరలు పెరగడంతో వేరుశెనగకు గిరాకీ పెరిగింది.
గతంలో అకాల వర్షాలు, పెట్టుబడి పెరగడం వల్ల నష్టపోయిన రైతులు(Andhra Pradesh Farmers) ఇప్పుడు ఈ పెరిగిన ధరల వల్ల తమ అప్పులు తీరుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కూడా రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకోవడం కలిసి వచ్చిందని విశ్లేషకులు చెబుతున్నారు.
