T20 World Cup 2026: 2026 టీ20 ప్రపంచ కప్లో రెండో రోజు అయిన ఆదివారం క్రికెట్ అభిమానులకు ఉత్కంఠభరితమైన మ్యాచ్లు అలరించనున్నాయి. ఈరోజు టోర్నీలో మూడు కీలక పోటీలు జరగనున్నాయి. చెన్నై, ముంబై, కొలంబో వేదికలుగా న్యూజిలాండ్–ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్–నేపాల్, శ్రీలంక–ఐర్లాండ్ జట్లు తలపడనున్నాయి.
రోజు తొలి మ్యాచ్ చెన్నైలో జరగనుంది. ఉదయం 11 గంటలకు న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు ఒకదానితో ఒకటి పోటీ పడతాయి. ఇది గ్రూప్-డీలో తొలి మ్యాచ్. న్యూజిలాండ్ జట్టు వార్మప్ మ్యాచ్లో అమెరికాపై విజయం సాధించినప్పటికీ, ప్రపంచ కప్కు ముందు భారత్తో జరిగిన సిరీస్లో పరాజయం ఎదుర్కొంది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ జట్టు వెస్టిండీస్పై ప్రాక్టీస్ మ్యాచ్లో గెలిచి ఆత్మవిశ్వాసంతో ఉంది. గత ప్రపంచ కప్లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ భారీ విజయం సాధించడంతో ఈసారి కూడా పోరు ఆసక్తికరంగా ఉండనుంది. చెన్నైలో వాతావరణం స్పష్టంగా ఉండే అవకాశం ఉంది. వర్ష సూచన లేకపోవడంతో మ్యాచ్ పూర్తిగా సాగుతుందని అంచనా.
T20 World Cup 2026: రెండో మ్యాచ్ సాయంత్రం 3 గంటలకు ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లాండ్ తమ తొలి మ్యాచ్లో నేపాల్ను ఎదుర్కొంటుంది. ఈ రెండు జట్లు టీ20 అంతర్జాతీయాల్లో తొలిసారి తలపడుతున్నాయి. బలమైన ఇంగ్లాండ్ జట్టు స్పష్టమైన ఫేవరెట్గా కనిపిస్తున్నప్పటికీ, నేపాల్ యువ ఆటగాళ్లతో సవాల్ విసరడానికి సిద్ధంగా ఉంది. వాంఖడే పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉండటంతో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది.
ఇక రోజు చివరి మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో శ్రీలంక, ఐర్లాండ్ మధ్య జరుగుతుంది. టోర్నమెంట్ ప్రారంభానికి ముందే శ్రీలంకకు గాయం తగిలినా, స్వదేశంలో ఆడుతున్న ప్రయోజనంతో బలంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు ఐర్లాండ్పై ఆడిన అన్ని టీ20 మ్యాచ్ల్లో శ్రీలంకే విజయం సాధించింది. అయితే కొలంబోలో వాతావరణం కొంత మేఘావృతంగా ఉండే అవకాశం ఉంది. స్వల్ప వర్షం మ్యాచ్పై ప్రభావం చూపే అవకాశమూ ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
ఈ మూడు మ్యాచ్లను స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లో ప్రత్యక్షంగా చూడొచ్చు. మొబైల్, ఓటీటీ వినియోగదారులకు జియో హాట్స్టార్లో లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది.
